రచయిత: ఆర్థర్ డబ్ల్యు పింక్
అనువాదం: నగేష్ సిర్రా
మొదటి ఆంగ్ల ముద్రణకు ముందుమాట
దేవుని వాక్యపు వెలుగులో అత్యంత గంభీరమైన ప్రశ్నలకు ఈ పుస్తకంలో జవాబులు చెప్పడానికి ప్రయత్నం చేశాను. గతంలో ఎంతోమంది ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి కృషి చేశారు. వారి ప్రయాసలు మనకెంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. నేను రాసినవన్నీ నా సొంత ఆలోచనలూ, తలంపులూ అని నేను చెప్పను. కానీ పూర్తిగా భిన్నమైన కోణంలో నేను ఈ అంశాన్ని చర్చించడం జరిగింది. Augustine, Acquinas, Calvin, Melanchthon, Jonathan Edwards, Ralph Erskine, Andrew Fuller, Robert Haldane మొదలైనవారి రచనలను నేను శ్రద్ధగా అధ్యయనం చేశాను. ప్రస్తుత తరానికి ఇలాంటి గొప్ప దైవజనులు ఏ మాత్రమూ పరిచయం లేకపోవడం శోచనీయం. వారు చెప్పిన మాటల్లో కొన్నిటితో నేను ఏకీభవించకపోయినా వారు చేసిన బోధలను బట్టీ, రాసిన గ్రంథాలను బట్టీ వారికెంతో రుణపడి ఉన్నాను. ఈ గొప్ప దైవశాస్త్ర పండితుల మాటలను నేను చాలా ఎక్కువగా ప్రస్తావించగలను. అయితే, మన పాఠకుల విశ్వాసం మనుషుల జ్ఞానం పై కాక, దేవుని శక్తి పై ఆధారపడి ఉండాలని నేను ఆ పని చేయలేదు. కేవలం లేఖనాలనే ఉపయోగిస్తూ నేను చెప్పిన ప్రతీ ముఖ్యమైన మాటకు ఆధారంగా లేఖనాన్నే చూపించే ప్రయత్నం చేశాను.
ఈ పుస్తకం ప్రజామోదం పొందాలని ఆశించడం వెర్రితనమే. ఎందుకంటే సృష్టికర్తను మహిమపరచడం కంటే మనిషిని దేవుని స్థాయికి హెచ్చించడం ప్రస్తుతం మనకు సంఘంలో ఎక్కువగా కనబడుతుంది. హేతువాదమనే పులిపిండి శరవేగంతో క్రైస్తవ్యమంతటినీ ఆవరిస్తుంది. డార్వినిజం మనం ఊహించినదానికంటే ఎంతో ఎక్కువగా దాని దుష్ప్రభావాన్ని విస్తరింపజేస్తోంది. వాక్యానుసారంగా ఉండేవారిగా పరిగణించబడే క్రైస్తవ నాయకులను లేఖనమనే త్రాసులో పెడితే వాళ్ళు వాక్యవిరుద్ధమైనవారని తేలిపోతారు. ఇతర విషయాల్లో స్పష్టత కలిగి ఉన్నవారు సిద్ధాంత సత్యం విషయంలో సరిగ్గా ఉండడం అరుదు. మనిషి సంపూర్ణంగా భ్రష్టుడు అనే సత్యాన్ని నమ్మేవాళ్ళు ఈ రోజున చాలా తక్కువగా ఉన్నారు. మనిషి యొక్క స్వతంత్ర చిత్తం (free will) గురించి మాట్లాడుతూ రక్షకుణ్ణి అంగీకరించడానికీ, తృణీకరించడానికి మనిషికి తనకు తానుగా సామర్థ్యం ఉన్నదని పట్టుబట్టేవాళ్ళు పతనమైనఆదాము సంతానపు నిజమైన స్థితిని గురించి వారికున్న అవగాహనాలోపాన్ని బయటపెట్టుకుంటున్నారు. పాపి యొక్క స్థితిని పూర్తిగా నిరీక్షణ లేనిదని నమ్మేవాళ్ళే చాలా తక్కువగా ఉంటే, దేవుడు సంపూర్ణ సార్వభౌముడని నిజంగా నమ్మేవాళ్ళు అత్యంత తక్కువగా ఉన్నారు.
లేఖనవిరుద్ధమైన బోధ మూలంగా కలిగిన దుష్ప్రభావాలతో పాటు, నేటి తరం యొక్క లోతులేని భక్తితో కూడా మనం వ్యవహరించాల్సి ఉంది. బైబిల్ సిద్ధాంతంపై పుస్తకం రాశామనే ఒక్కమాట చాలు ఎంతోమంది సంఘసభ్యులు, ప్రసంగీకులు విమర్శల బాణాలు ఎక్కుపెట్టడానికి! నేటి సంఘప్రజలు రుచికరమైన, ఆకర్షణీయమైన సంగతుల కోసం వెంపర్లాడుతున్నారు. తమ హృదయాలనూ, మనస్సులనూ సవాలు చేసే సంగతులను శ్రద్ధగా అధ్యయనం చేసే ఓపిక గానీ, కోరిక గానీ ప్రజలకు లేవు. దేవుని గురించి లోతైన సంగతులను అధ్యయనం చేయాలనే ఆశ ఉన్నా, దానికి అవసరమైన, చేయాల్సిన కృషి చేయడానికి వారికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే మనస్సుంటే మార్గం ఉంటుంది అనే మాట సత్యం. ఇంతవరకు నిరుత్సాహపరిచే విషయాలను ప్రస్తావించాను. అయితే ఇప్పుడు కూడా భక్తిగల శేషజనం ఉన్నారు. ఈ పుస్తకంలోని అంశాన్ని శ్రద్ధగా పరిశీలన చేయడానికి వారు ఆనందిస్తారు. దీనిలో ఆరోగ్యకరమైన ఆహారముందని కనుగొంటారు.
‘ఓటమిపాలైన ప్రత్యర్థి చేసే ఆఖరు దాడి నిందారోపణ చేయడం’ అని ఒకాయన అన్నారు. ఈ పుస్తకాన్ని ‘హైపర్ కాల్వినిజం’ అని నిందించి కొట్టిపారేయడం సబబు కాదు. వివాదాలంటే నాకు ఆసక్తి లేదు. ఈ పుస్తకాన్ని నేను ప్రభువు హస్తాలకే అప్పగిస్తున్నాను. తన ప్రజలను వెలిగించడానికి ప్రభువు దీనిని ఒక ఉపకరణంగా ఉపయోగించుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ పుస్తకంలో నా పొరపాటు వలన కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చు. ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే ప్రభువే నన్ను క్షమించాలనీ, చదివేవారిపై ఆ తప్పుల ప్రభావం పడకూడదనీ నేను ఆయనను వేడుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని రాస్తుండగా నాకు కలిగిన ఆనందం, ఆదరణ దీనిని చదివేవారికి కూడా కలుగుతాయి. ఆత్మసంబంధమైన సంగతులను వివేచించడానికి మనల్ని బలపరిచే కృపగల దేవునికి మాత్రమే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
ఈ మధ్యకాలంలో దేవుని సార్వభౌమత్వం గురించి అద్భుతంగా బోధించినవారిలో Dr Rice, J.B.Moody, Bishop తదితరులున్నారు. వారి రచనల నుండి కూడా నేను పలు విషయాలను నేర్చుకున్నాను.
రెండవ ఆంగ్ల ముద్రణకు ముందుమాట
ఈ పుస్తకపు మొదటి ఆంగ్లముద్రణను క్రైస్తవ సమాజానికి అందించి ఇప్పటికి రెండు సంవత్సరాలయ్యింది. నేను ఊహించినదానికంటే ఎక్కువ ఆదరణ ఈ పుస్తకానికి లభించింది. దేవుని సార్వభౌమత్వం అనే అంశం బోధించడానికీ, రాయడానికీ కష్టమైనప్పటికీ, దానిని వివరించడానికి నేను చేసిన ప్రయత్నం వల్ల తమకు ఎంతో సహాయం, దీవెనలు కలిగాయని చాలామంది నాకు తెలియజేశారు. నాకు అందిన ప్రతీ అభినందన నిమిత్తం దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన వెలుగులోనే మనం వెలుగును చూస్తున్నాము. కొంతమంది కఠినమైన, పరుషమైన పదజాలంతో ఈ పుస్తకాన్ని విమర్శించారు. “తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని యెవడును ఏమియు పొందనేరడు” (యోహాను 3:27) అనే వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారిని దేవునికీ, ఆయన యొక్క కృపాసహిత వాక్యానికి అప్పగిస్తున్నాను. కొందరు స్నేహపూర్వకమైన విమర్శలు నాకు పంపించారు. వీటిని నేను శ్రద్ధగా పరిశీలించాను. కొన్ని సవరణలు చేశాను. అందువల్ల మొదటి ముద్రణ కంటే ఈ ముద్రణ విశ్వాసగృహంలో సభ్యులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నా నమ్మకం.
దేవుని సార్వభౌమత్వం అనే అంశాన్ని నేను వివరించిన విధానం మరీ విపరీత స్థాయిలో ఉందని క్రీస్తునందున్న గౌరవనీయులైన సహోదరులు కొందరు భావిస్తున్నారు. దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు సత్యాన్ని సమపాళ్ళలో భద్రపరచాల్సిన అవసరముందని కొందరు చెప్పారు. ఈ మాటతో నేను హృదయపూర్వకంగా ఏకీభవిస్తున్నాను. దేవుడు సార్వభౌముడు, మనిషి తన చర్యలకు బాధ్యత వహించాల్సినవాడు. ఈ రెండు సత్యాలు వివాదానికి అతీతమైనవి. మనిషి తన చర్యలకు బాధ్యుడనే విషయాన్ని అంగీకరిస్తున్నాను కానీ ప్రతీ పేజీలోనూ ఈ విషయాన్ని చర్చించలేదు. కేవలం దేవుని సార్వభౌమత్వం గురించి మాత్రమే నేను ఈ పుస్తకంలో చర్చించాను. నేడు సార్వత్రికంగా విస్మరించిన దేవుని సార్వభౌమత్వం అనే అంశాన్నే నేను నొక్కి చెప్పడానికి ప్రయత్నించాను. నేటి క్రైస్తవ సాహిత్యం దాదాపు 75 శాతం మనుషుల బాధ్యతలనూ, ధర్మాలనూ వివరించేందుకు తనను తాను అంకితం చేసుకుంది. మనిషి యొక్క బాధ్యత గురించి వివరించడానికి ప్రయత్నించినవాళ్ళే ఎక్కువ శాతం దేవుని సార్వభౌమత్వం అనే అంశాన్ని నిర్లక్ష్యం చేసి సత్యసమతుల్యతను కాపాడుకోలేకపోయారనేది వాస్తవం. మనిషి యొక్క బాధ్యత గురించి నొక్కి చెప్పడం సరైన విషయమే. మరైతే దేవుని సార్వభౌమత్వం గురించి చెప్పాలా, వద్దా? ఆయనకు హక్కులు లేవా? సత్యసమతుల్యతను తిరిగి పొందాలంటే ఇలాంటివి వంద పుస్తకాలు రచించబడాలి, ఈ అంశంపై దేశమంతా పదివేల ప్రసంగాలు ప్రకటించబడాలి. దేవుని సార్వభౌమత్వం అనే అంశాన్ని నిర్లక్ష్యం చేసి, మానవుని కర్తవ్యానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం వల్లనే సత్యసమతుల్యత దెబ్బతింది. అందువల్ల ఎక్కువ శాతం నిర్లక్ష్యం చేయబడిన అంశాన్నే నేను ఈ పుస్తకంలో రాశానని ఒప్పుకుంటున్నాను. మనిషిని ఘనపరచి దేవుణ్ణి అల్పునిగా చేయడం ప్రమాదమా? లేదా మనిషిని అల్పునిగా చేసి దేవుణ్ణి ఘనపరచడం ప్రమాదకరమా? దేవుని సార్వభౌమత్వం సంపూర్ణమైనదనీ, విశ్వవ్యాప్తమైనదనీ నొక్కిచెప్పడం నేరమా?
ఈ అంశంపై సర్వశక్తిమంతుడైన దేవుడు తన బిడ్డలకు ఏమి వెల్లడి చేయాలని ఇష్టపడ్డాడో తెలుసుకోవాలనే తాపత్రయంతో రెండు సంవత్సరాలు పరిశుద్ధ లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేసిన తర్వాత, ఇంతకుముందు నేను రాసినదానిలో దేనినీ వెనక్కి తీసుకోవడానికి నాకు సరైన హేతువు కనబడలేదు. ఈ పుస్తకంలోని సమాచారాన్ని పునరమరిక చేశాను.కానీ సారాంశాన్ని గానీ, సిద్ధాంతాన్ని గానీ మార్చలేదు. దీనికై దేవునికి లెక్కలేని స్తుతులు. మొదటి ముద్రణను దీవించిన దేవుడే ఈ రెండవ ముద్రణను కూడా దీవించును గాక!
1921 Swengel, Pa
మూడవ ఆంగ్ల ముద్రణకు ముందుమాట
ఈ పుస్తకం మూడవసారి ముద్రణకు రావడాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకమైన స్తుతులు చెల్లిస్తున్నాను. ఆధ్యాత్మిక అంధకారం ముసురుకుంటున్న సమయంలో, మనుషుల నటనలు తీవ్రస్థాయికి చేరుకుంటున్న సందర్భంలో సమస్తానికీ యజమాని అయిన దేవుని అధికారాలను ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 20వ శతాబ్దపు క్రైస్తవ్యంలో ఎన్నో తప్పుడు బోధలు ఎంతోమందిని కలవరపెడుతుండగా, ఎంతో స్పష్టంగా దేవుని సేవకులు ప్రజల హృదయాలకు నెమ్మది కలుగజేసే సత్యాన్ని ప్రకటించబద్దులైయున్నారు. ప్రభువే ఈ విశ్వమనే సింహాసనంపై ఆసీనుడై సమస్తాన్నీ తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున జరిగిస్తున్నాడనే విషయం కంటే నెమ్మదినిచ్చే, స్థిరపరిచే అంశం మరొకటి ఏదీ లేదు.
లేఖనాల్లో అర్థం చేసుకోవడానికి కష్టమైన విషయాలు కొన్ని ఉన్నాయని పరిశుద్ధాత్ముడు మనతో చెప్పాడు. అయితే అవి కష్టమైనవే కానీ అసాధ్యమైనవి కానివని గమనించండి. ప్రభువు దగ్గర ఓపికతో కనిపెట్టి, లేఖనాలతో లేఖనాలను శ్రద్ధగా పోల్చి చూస్తే తరచూ మనకు ఇంతకుముందు స్పష్టంకాని విషయాలపై పూర్తి అవగాహన కలుగుతుంది. గత 10 సంవత్సరాల్లో దేవుడు తన వాక్యంలోని కొన్ని భాగాల పై మరింత వెలుగును నాకు అనుగ్రహించాడు. అందువల్ల కొన్ని వాక్యభాగాల వివరణను మెరుగుపరచడానికి నేను ఆ వెలుగును ఉపయోగించాను. అయితే ఇంతకుముందు ముద్రణల్లో ఉన్న సిద్ధాంతాన్ని మార్చడం అనవసరమని నేను భావించాను.దాని నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాలం గడిచేకొద్దీ, మన జీవితాల్లో ప్రతీ రంగానికి దేవుని సార్వభౌమత్వం అనే సత్యపు అవసరత పెరుగుతూనే ఉంటుందని నా అభిప్రాయం.
ఈ పుస్తకం తొలి రెండు ముద్రణల వలన అందిన సహాయం గురించీ, దీవెనల గురించి చెబుతూ ఎన్నో ప్రాంతాల నుంచి ప్రజలు రాసిన లేఖలను బట్టి నా హృదయం ఆనందంతో పులకరించింది. ఒక క్రైస్తవ స్నేహితుడు ఈ పుస్తకాన్ని చదివి ఎంతగానో ప్రోత్సహించబడ్డాడు. ఇందులోని సత్యం చేత పురికొల్పబడ్డాడు. ఈ పుస్తకంలోని మహిమకరమైన సందేశం ప్రపంచమంతటా ప్రకటించబడాలనే ఉద్దేశంతో 50కి పైగా విదేశాల్లో ఉన్న మిషనరీలకు ఉచితంగా ఈ పుస్తకాలు పంపించమని ఒక చెక్కును పంపించాడు. అంధకార శక్తులతో తాము చేస్తున్న పోరాటంలో ఈ పుస్తకంలోని సందేశం తమను ఎంతగానో బలపరచిందని చెబుతూ ఎంతోమంది నాకు ఉత్తరాలు రాశారు. సమస్త మహిమ దేవునికే కలుగును గాక! గొప్పదైన తన నామాన్ని ఈ మూడవ ముద్రణ ద్వారా ఆయన ఘనపరుచుకొనును గాక! లోకమంతటా చెదిరిపోయిన, ఆకలితో అలమటిస్తున్న తన గొర్రెలను పోషించడానికి ఈ పుస్తకంలోని సత్యాన్ని దేవుడు ఉపయోగించుకొనును గాక!
నాలుగవ ఆంగ్ల ముద్రణకు ముందుమాట
విలువైన, సహాయకరమైన ఈ పుస్తకాన్ని మరొకసారి ముద్రించగలుగుతున్నందుకు సర్వోన్నతుడైన దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాము. సంఘంలో నేడు అత్యధికంగా ప్రకటించబడుతున్న దానికి విరుద్ధంగా ఇందులోని ఉపదేశం ఉంది. అయినాసరే, దేవుని ఏర్పాటులో ఉన్నవారి విశ్వాసాన్ని బలపరచడానికీ, వారిని ఆదరించడానికీ, వారికి నిరీక్షణను ఇవ్వడానికీ ఇదెంతగానో ఉపయోగపడుతుంది. మనం ఎవరిని ఘనపరచడానికి ఆనందిస్తున్నామో ఆయనకు ఈ నూతన ముద్రణను అంకితం చేస్తున్నాము. తన కృపామహిమకు కీర్తి కలిగేలా, తన ప్రజలకు మరింత వాక్యపు వెలుగు కలిగేలా, దేవుని ఔన్నత్యం గురించి, ఆయన సార్వభౌమ కనికరం గురించి ప్రజలకు స్పష్టమైన అవగాహన కలిగేలా ఆయన ఈ పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువెళ్ళాలని మా ప్రార్థన.
పరిచయం
ప్రస్తుతం భూలోకంలోని సంగతుల్ని ఎవరు నియంత్రిస్తున్నారు? దేవుడా? లేక సాతానా? పరలోకంలో పరిపాలన దేవునిదే అని అందరూ ఒప్పుకుంటారు. అయితే ఈ లోకాన్ని ఆయనే పరిపాలిస్తున్నాడు అనే మాటను అందరూ తృణీకరిస్తున్నారు – ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా! మనుషులు తాత్వికంగా, హేతుబద్ధంగా ఆలోచిస్తున్నామంటూ దేవుణ్ణి తెరవెనుకకు నెట్టేస్తున్నారు. భౌతిక ప్రపంచం గురించి ఆలోచించండి. సమస్తాన్నీ నేరుగా వ్యక్తిగతంగా దేవుడు సృష్టించాడని ప్రజలు అధికశాతం తృణీకరించడమే కాదు, తన చేతి పనులను నిర్వహించడంలో ఆయన నేరుగా జోక్యం చేసుకుంటాడనే విషయాన్ని కూడా పెద్దగా ఎవ్వరూ నమ్మట్లేదు. నిర్జీవమైన, వ్యక్తిత్వం లేని ప్రకృతి నియమాలే సమస్తాన్నీ క్రమంగా నిర్వహిస్తున్నాయనీ, నడిపిస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఆ విధంగా మనుషులు సృష్టికర్తను తన సృష్టి నుంచి వెలివేస్తున్నారు. భ్రష్టమైన, పతనమైన ఆలోచనలతో మానవ జీవితాల నుంచి దేవుణ్ణి నెట్టివేయడం మనకు ఆశ్చర్యాన్ని కలిగించాల్సిన అవసరం లేదు. మనిషి స్వేచ్ఛాజీవి కాబట్టి తన జీవితంలో జరిగే అనూహ్యమైన పరిస్థితులకు తానే కారకుడు, తన భవిష్యత్తుకు తానే నిర్ధారకుడు అనే సిద్ధాంతాన్ని క్రైస్తవ ప్రపంచమంతా నమ్ముతూనే ఉంది. దీనికి భిన్నమైన సత్యాన్ని నమ్మేవాళ్ళు అత్యల్ప సంఖ్యలో ఉన్నారు. సమస్తానికీ మనిషే బాధ్యుడు అని చెప్పేవారున్నారు. అయితే, మానవుని బాధ్యత గురించి అధిక ప్రసంగాలు చేసేవారు, తమ సొంత హృదయాల్లో నుండి బయలువెళ్ళే దుష్కార్యాలకు మాత్రం (మార్కు 7:21-23) సాతానుని నిందిస్తూ తమ సొంత బాధ్యత నుండి తప్పించుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం భూలోకంలోని సంగతుల్ని ఎవరు నియంత్రిస్తున్నారు? దేవుడా? లేక సాతానా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల అభిప్రాయాన్ని సేకరించడానికి ప్రయత్నించండి. ప్రతి వైపు నుంచి ఎంతో అయోమయమైన, అస్తవ్యస్తమైన పరిస్థితే మనకు తారసపడుతుంది. పాపం ప్రబలిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది, దుష్టులు, వంచకులు అంతకంతకు చెడిపోతున్నారు(2తిమోతి 3:13). నేటి దినాన ప్రతీదీ అదుపు తప్పినట్లుగానే కనబడుతుంది. సింహాసనాలు తత్తరిల్లుతున్నాయి. ప్రాచీన రాజవంశాలు తలక్రిందులౌతున్నాయి, ప్రజాస్వామ్యాలు తిరుగుబాటు చేస్తున్నాయి, నాగరికత విఫలమౌతుంది. క్రైస్తవ్యంలో సగభాగం ఈమధ్య కాలంలోనే మరణ పోరాటంలో చిక్కుకుపోయింది. ప్రపంచం ప్రజాస్వామ్యానికి అనుకూలంగా తయారు చేయబడిందనే అభిప్రాయానికి విరుద్ధంగా, ప్రపంచానికి ప్రజాస్వామ్యం ఏ మాత్రమూ సురక్షితం కాదని తెలుసుకున్నాం. అశాంతి, అసంతృప్తి, అక్రమాలు ప్రతీచోటా విస్తరిస్తున్నాయి. మరొక ప్రపంచయుద్ధం ఎంత త్వరలో రాబోతుందో ఏ ఒక్కరం చెప్పలేము. రాజనీతిజ్ఞులు, ప్రముఖులు కలవరపడుతున్నారు, తడబడుతున్నారు. భూమి మీద సంభవించబోతున్నవాటి విషయమై మనుషులు భయాందోళనలకు గురై, ధైర్యము చెడి కూలిపోతున్నారు (లూకా 21:26). దేవుడు సంపూర్ణంగా లోకాన్ని నియంత్రిస్తున్నాడనేలా ఈ పరిస్థితులు కనబడుతున్నాయా?
అయితే ఆధ్యాత్మిక ప్రపంచానికి మన గమనాన్ని పరిమితం చేద్దాం. సువార్తను గత 19 శతాబ్దాలుగా ప్రకటిస్తూనే ఉన్నప్పటికీ, మనుషులు ఇంకా క్రీస్తును అవమానిస్తూ, తృణీకరిస్తూనే ఉన్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, లేఖనాల్లో వెల్లడి చేయబడిన క్రీస్తును ప్రకటించేవాళ్ళు, ఘనపరిచేవాళ్ళు చాలా చాలా తక్కువమందే ఉన్నారు. ఆధునిక ప్రసంగ వేదికల్లో ఆయన అవమానించబడుతున్నాడు, తృణీకరించబడుతున్నాడు. జనసమూహాలను ఆకర్షించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ అత్యధిక సంఘాలు జనాలతో నింపబడటానికి బదులు ఖాళీ ఔతున్నాయి. సంఘానికి హాజరు కాని ప్రజల పరిస్థితి ఏమిటి? నాశనానికి నడిపించే విశాలమైన మార్గంలో అనేకమంది ప్రజలున్నారనీ, జీవానికి నడిపించే ఇరుకు మార్గంలో ప్రయాణించేది కొంతమందేననీ లేఖనాలు చెబుతున్నాయి. ఈ సత్యాన్ని లేఖనాల వెలుగులో మనం నమ్మేలా బలవంతపెట్టబడుతున్నాము. క్రైస్తవ్యం ఒక ఘోరమైన వైఫల్యమని కొందరు అభిప్రాయపడుతున్నారు. పలువురి ముఖాల్లో నిర్వేదం కనబడుతుంది. ప్రభుని సొంత ప్రజలే ఎంతోమంది గాబరాపడుతున్నారు. వారి విశ్వాసం తీవ్రంగా పరీక్షించబడుతుంది. దేవుని స్వభావం ఎలాంటిది? ఆయన చూడగలడా? వినగలడా? ఆయన అసమర్థుడా? లేదా ఉదాసీన వైఖరిగలవాడా? ‘గతంలో సంభవించిన రెండవ ప్రపంచ మహాయుద్ధం జరగకుండా దేవుడు ఆపలేకపోయాడు, దాన్ని అంతమొందించలేకపోయాడు’ అని క్రైస్తవ నాయకులుగా పరిగణించబడేవాళ్ళు మనకు చెబుతున్నారు. పరిస్థితులు దేవుని చేయి దాటిపోయాయని బహిరంగంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే దేవుడే ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడని అనిపిస్తుందా?
ప్రస్తుతం భూలోకంలోని సంగతుల్ని ఎవరు నియంత్రిస్తున్నారు? దేవుడా? లేక సాతానా? అప్పుడప్పుడు సువార్త సభలకు హాజరయ్యే లోకానుసారుల మనస్సులపై ఎటువంటి ప్రభావం పడుతుంది? “వాక్యానుసారమైన” బోధ చేసేవారి మాటలు సైతం వినేవారికి ఎటువంటి ఆలోచనలు కలుగుతాయి? క్రైస్తవులు నమ్ముతున్నది భంగపడిన దేవుణ్ణి అనే అభిప్రాయం కలగదా? నేటి సగటు సువార్తికుని మాటల్ని యథార్థంగా పట్టించుకునేవారు, అతను ప్రకటించే దేవుడు దయావాత్సల్యాలతో నిండిన ఉద్దేశాలున్నప్పటికీ వాటిని నెరవేర్చుకోలేకపోతున్నాడని, ఆయన ఎంతో యథార్థంగా మనుషుల్ని దీవించాలని అపేక్షిస్తున్నా, వాళ్ళు ఆయనను అందుకు అనుమతించడం లేదని నమ్మడానికి బలవంతపెట్టబడటం లేదా? ఈ పరిస్థితుల్లో సాతాను పైచేయి సాధించాడని, కాబట్టి దేవుణ్ణి నిందించడానికి బదులు ఆయనపై జాలిపడాలనే నిర్ణయానికి వినేవారు రావడం సబబు కాదా?
దేవునికంటే సాతానే ఎక్కువగా భూలోక సంగతుల్ని నియంత్రించడంలో నిమగ్నమై ఉన్నట్లు కనిపించడం లేదా? ఇదంతా మనం విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నామా లేదా వెలిచూపును బట్టి జీవిస్తున్నామా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ప్రియ చదువరీ, ఈ లోకం గురించిన, దానితో దేవునికున్న సంబంధం గురించిన మీ ఆలోచనలు మీరు చూస్తున్నదానిపైనే ఆధారపడి ఉన్నాయా? ఈ ప్రశ్నను తీక్షణంగా, నిజాయితీగా మీరు ఎదుర్కోండి. మీరు క్రైస్తవుడైతే దుఃఖంతో, అవమానభారంతో తలవంచుకుని ‘ఔను, నా ఆలోచనలు అలాగే ఉన్నాయి’ అని ఒప్పుకోవాలి. అయ్యో, మనం విశ్వాసాన్ని బట్టి నడుచుకోవడం చాలా చాలా తక్కువగా జరుగుతుంది. ఇది వాస్తవం. అసలు విశ్వాసాన్ని బట్టి నడుచుకోవడమంటే అర్థం ఏమిటి? ‘పరిశుద్ధ లేఖనాలే మన ఆలోచనలకు రూపమివ్వాలి, మన చర్యలను నియంత్రించాలి, మన జీవితాలను మలచాలి’ అని అర్థం. ఎందుకంటే, “కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును” (రోమా 10:17). ఈ లోకంతో దేవునికున్న సంబంధమేమిటో మనం తెలుసుకోవాల్సింది కేవలం సత్యవాక్యం నుంచే కానీ మనం చూస్తున్నవాటి నుంచి కాదు!
ప్రస్తుతం భూలోకంలోని సంగతుల్ని ఎవరు నియంత్రిస్తున్నారు? దేవుడా, లేక సాతానా? లేఖనాలు ఏమి చెబుతున్నాయి? ఈ ప్రశ్నకు సూటైన జవాబు కనుక్కోవడానికి ముందు, ఇప్పుడు మనం చూస్తున్న, వింటున్నవాటిని లేఖనాలు ముందే ప్రవచించాయి అని గమనించాలి. యూదా రాసిన ప్రవచనం ఇప్పుడు నెరవేరే ప్రక్రియలో ఉంది. దీనిని పూర్తిగా చర్చించడం మొదలుపెడితే మన ప్రస్తుత అంశం నుండి దృష్టి మరలే అవకాశం ఉంది. అయితే నేను ఈ పత్రికలోని 8వ వచనంలో ఉన్న ఒక మాటను పరిగణలోకి తీసుకోవాలనుకుంటున్నాను – “అటువలెనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు”; ఔను, సర్వోన్నతుడైన మహాత్ముడు, సార్వభౌముడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినవానినే వాళ్ళు దూషిస్తున్నారు. ప్రామాణిక సత్యాలను లెక్కచేయని వింతైన తరం మనది; మన స్వతంత్రానికీ, ఇష్టానికి అడ్డుపడే ప్రతిదానినీ తృణీకరించే యుగం మనది. అందువల్ల అక్రమం మన భూమిని శరవేగంగా, పెను ఉప్పెనలా ముంచేస్తుంది. ఈ తరం అత్యంత దుష్టమైనది. తల్లిదండ్రుల అధికారం క్షీణించిపోవటం ప్రభుత్వాధికారానికి వాటిల్లబోయే నిర్మూలనకు ఖచ్చితమైన సూచనగా ఉంది. చట్టవ్యవస్థను గౌరవించకపోవడం, సన్మానించాల్సినవారిని సన్మానించకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు అయిన దేవుని గొప్పతనాన్నీ, అధికారాన్ని తెర వెనుకకు నెట్టివేయడం, వీటికి లోబడమని బోధించేవారి పట్ల తీవ్రమైన అసహనం చూపడం వంటివి చూసి మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు రాబోయే కాలంలో ఏ మాత్రమూ బాగుపడకపోగా ఇంకా విషమిస్తాయని మరి స్థిరమైన ప్రవచన వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ ప్రవాహాన్ని అడ్డుకోగలమని కూడా మనం భావించనవసరం లేదు. ఎందుకంటే అది మనకు అందనంత ఎత్తుకు ఎప్పుడో ఎగిసిపోయింది. మనం చేయగలిగిందల్లా మన తోటి పరిశుద్ధుల్ని ఈ తరంలో ఉన్న దుష్టత్వం గురించి హెచ్చరించి, నాశనకరమైన దాని ప్రభావం వారిపై పడకుండా అవరోధించడమే.
ప్రస్తుతం భూలోకంలోని సంగతుల్ని ఎవరు నియంత్రిస్తున్నారు? దేవుడా, లేక సాతానా? లేఖనాలు ఏమి చెబుతున్నాయి? సూటిగాను స్పష్టంగాను లేఖనాలు ప్రకటించేవాటిని విశ్వసిస్తే ఒక్క సందేహానికి కూడా ఆస్కారం ఉండదు. తన విశ్వపు సింహాసనంపై దేవుడు ఆసీనుడై ఉన్నాడని, రాజదండం ఆయన చేతుల్లోనే ఉందని, తన చిత్తప్రకారమైన సంకల్పాన్ని బట్టి ఆయన సమస్తాన్ని నడిపిస్తున్నాడని లేఖనాలు పదేపదే బోధిస్తున్నాయి. సమస్తాన్ని సృష్టించడమే కాదు, తన చేతి పని అంతటిపై ఆయన ఏలుబడి చేస్తున్నాడని లేఖనాలు ఉపదేశిస్తున్నాయి. దేవుడు సర్వశక్తిమంతుడనీ, ఆయన చిత్తం స్థిరమైనదనీ, సమస్త సృష్టిపైన ఆయన సార్వభౌముడనీ లేఖనాలు ముక్తకంఠంతో వివరిస్తున్నాయి. తప్పనిసరిగా ఇదే నిజమయ్యుండాలి; రెండే రెండు ప్రత్యామ్నాయాలున్నాయి – దేవుడే పరిపాలించాలి, లేదా దేవుణ్ణి వేరెవరైనా పరిపాలించాలి. ఆయనే సమస్తాన్ని నియంత్రించాలి, లేదా ఆయన్నే వేరెవరైనా నియంత్రించాలి. ఆయన చిత్తం నెరవేరాలి, లేదా ఆయన చిత్తం సృష్టి చేత భంగపరచబడాలి. ఆయన సర్వోన్నతుడు, ఆయన మాత్రమే సార్వభౌముడు, రాజులకు రాజు, సంపూర్ణ జ్ఞాని, మితిలేని శక్తి గలవాడు అని అంగీకరిస్తే, కేవలం నామమాత్రంగానే కాదు, నిజంగా కూడా ఆయనే దేవుడని అంగీకరించక తప్పదు.
పైన క్లుప్తంగా ప్రస్తావించినవాటి వెలుగులో, దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వసమృద్ధిగలవాడు, సార్వభౌముడు అనే అంశాలను లోతుగా పరీక్షించి వినూత్న విధానంలో ప్రకటించాలని ప్రస్తుత పరిస్థితులు బలవంతపెడుతున్నాయి. దేవుడు ఇప్పటికింకా జీవిస్తూనే ఉన్నాడనీ, పరిశీలిస్తూనే ఉన్నాడనీ, పరిపాలిస్తూనే ఉన్నాడనీ ఈ దేశంలోని ప్రతీ ప్రసంగ వేదికల నుండి వాక్యోపదేశకులు గర్జించాలి. విశ్వాసం ఇప్పుడు మూసలో ఉంచబడింది. అగ్నిచేత అది పరీక్షించబడుతుంది. మనస్సుకూ, హృదయానికీ దేవుని సింహాసనం దగ్గర కాకుండా మరెక్కడా స్థిరమైన, చాలినదైన విశ్రమస్థానం లేదు. ఇంతకు ముందెన్నడూ చెప్పని విధంగా ఇప్పుడు దేవుని యొక్క దైవత్వం గురించి సంపూర్ణంగా, స్థిరంగా చెప్పాల్సిన అవసరముంది. కఠినమైన వ్యాధులకు కఠినమైన చికిత్స చేయాలి. చప్పని, సాధారణమైన మాటల్ని వినీ వినీ ప్రజలు విసిగిపోయారు. వాళ్ళకు స్థిరమైన, బలమైన సత్యం అవసరం. తియ్యని పానకం విసిగించే పిల్లలకు పనిచేయవచ్చేమో కానీ పెద్దలకు మాత్రం బలమైన ఔషధమే కావాలి. దేవుని సంపూర్ణ స్వభావాన్ని లేఖనాల వెలుగులో అవగతం చేసుకోవడం కంటే ఆత్మశక్తిని మనలోనికి ప్రవహింపచేయగలిగే మరొక విధానం నాకు తెలియదు. “తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు” (దానియేలు 11:32) అని రాయబడి ఉంది.
ప్రపంచం నిస్సందేహంగా సంక్షోభం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది; ప్రతీచోట ప్రజలు భయభ్రాంతులతో జీవిస్తున్నారు. అయితే దేవునికి ఎలాంటి భయాందోళనలూ ఉండవు. ఆయనను ఎవ్వరూ ఆశ్చర్యపరచలేరు. అత్యవసరమైన, అనూహ్యమైన పరిస్థితి ఏదీ ఆయనను ఇరకాటంలో పెట్టదు. ఎందుకంటే ‘తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగిస్తున్నవాడు’ ఆయనే (ఎఫెసీ 1:11-12). అందువల్ల లోకం భయంతో వణుకుతున్నప్పటికీ, విశ్వాసికి చెప్పబడిన మాట “భయపడవద్దు! ” “సమస్త కార్యములు” దేవుని నియంత్రణలోనే ఉన్నాయి; దేవుని నిత్యసంకల్పాలకు అనుగుణంగానే “సమస్త కార్యములు” జరుగుతూ ఉన్నాయి. కాబట్టి “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి”. అది అలాగే జరగాలి; ఎందుకంటే “ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి” (రోమా 11:36). అయితే కనీసం దేవుని ప్రజలైనవారు కూడా ఈ సంగతుల్ని నేడు ఎంతో అరుదుగా గుర్తిస్తున్నారు! భూమిపై జరుగుతున్న సంగతుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా దూరం నుండి వాటిని చూస్తున్న ప్రేక్షకుడు దేవుడని చాలామంది భావిస్తున్నారు.
మనిషికి చిత్తం ఉందనేది ఎంత సత్యమో, దేవునికి కుడా చిత్తం ఉందనేది అంతే సత్యం. మనిషికి శక్తి అనుగ్రహించబడిందనే మాట ఎంత వాస్తవమో, దేవుడు సర్వశక్తిమంతుడనే మాట కూడా అంతే వాస్తవం. భౌతిక ప్రపంచం ప్రకృతి నియమాలచే నిర్వహించబడుతుందనే మాట నిజమే. అయితే ఆ నియమాల వెనుక వాటిని నియమించినవాడు, నియంత్రించేవాడు ఉన్నాడనే మాట కూడా అంతే నిజమే. మనిషి సృష్టించబడినవాడు, దేవుడు సృష్టికర్త. మనిషి వెలుగును చూడటానికి లెక్కలేని యుగాలకు ముందే “బలవంతుడైన దేవుడు” (యెషయా 9:8) ఉనికిలో ఉన్నాడు. లోకం స్థాపించబడక ముందే ఆయన తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. దేవుడు అనంతమైన శక్తి కలిగినవాడు. మనిషికి ఉన్న శక్తి పరిమితమైనది. తన చేతులతో సృష్టించుకున్న జీవుల వలన అనంతుడైన దేవుని ప్రణాళికలు, ఉద్దేశాలు ఆటంకపరచబడవు.
జీవితం గంభీరమైన సమస్యలతో కూడినదనీ, మనకు అంతుచిక్కని ఎన్నో విషయాలు మన చుట్టూ ఉన్నాయనీ మనం నిస్సందేహంగా ఒప్పుకుంటాం. తమ మూలాన్నెరుగని, తమ ముందున్నవాటి గురించి అవగాహన లేని భూజంతువుల్లాంటి వాళ్ళం కాదు మనం. మనకు మరింత స్థిరమైన ప్రవచనవాక్యం ఉంది. దీని గురించే పేతురు ఇలా చెబుతున్నాడు, “తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు” (2 పేతురు 1:19). మనం లక్ష్యపెడితే మనకు మేలు కలిగించేది ఈ ప్రవచన వాక్యమే. ఈ వాక్యం మానవమేథస్సు నుండి కాక దేవుని మనస్సు నుండి ఉద్భవించినది. “ఎందుకంటే ప్రవచనము ఎప్పుడునుమనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి” (2 పేతురు 1:21). మరొకసారి చెబుతున్నాను, మనం లక్ష్యపెట్టాల్సింది ఈ వాక్యాన్నే, అప్పుడే మనకు మేలు చేకూరుతుంది.
మనం ఈ వాక్యం వైపు మళ్ళి, దాని ఉపదేశాన్ని గైకొంటే, ప్రతీ సమస్యకూ అన్వయించాల్సిన ఒక ప్రాథమిక నియమాన్ని కనుగొంటాం: మనిషితో లోకంతో మొదలుపెట్టి దేవుణ్ణి సమీపించకుండా, దేవునితో మొదలుపెట్టి మనిషి దగ్గరకు రావాలి. “ఆదియందు దేవుడు” అనే నియమాన్ని ప్రస్తుత పరిస్థితికి అన్వయించండి. నేటి ప్రపంచంతో మొదలు పెట్టి దేవుని వైపు మనం వెళ్తుంటే, ఈ ప్రపంచంతో దేవునికి అస్సలు ఎలాంటి సంబంధమూ లేనట్టు కనిపిస్తుంది. అయితే దేవునితో మొదలు పెట్టి, లోకం వైపుగా రండి; అప్పుడు సమస్య పైన ఒక నూతన వెలుగు ప్రసరిస్తుంది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపంపై ఆయన కోపం రగులుకుంటుంది. దేవుడు “నీతిమంతుడు” కనుక ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారిపై ఆయన తీర్పులు వెలువడతాయి. దేవుడు నమ్మదగినవాడు కనుక తన వాక్యంలోని గంభీరమైన హెచ్చరికలు నెరవేరతాయి. దేవుడు సర్వశక్తిమంతుడు కనుక ఆయనను ఎవ్వరూ విజయవంతంగా ఎదిరించలేరు, ఆయన ఆలోచనను నిర్వీర్యం చేయలేరు. దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ఏ సమస్య ఆయనపై అధికారం చెలాయించలేదు, ఏ కష్టమూ ఆయన జ్ఞానాన్ని కలవరపరచలేదు. దేవుడు ఎవరైయున్నాడో, ఏమైయున్నాడో దాని ఫలితంగానే మనం ఈ లోకంలో చూసేవి సంభవిస్తున్నాయి – అవి ఆయన న్యాయతీర్పు కుమ్మరించబడటానికి కేవలం ప్రారంభాలు మాత్రమే. ఆయన స్థిరమైన న్యాయాన్నీ, పరిపూర్ణమైన పరిశుద్ధతనూ దృష్టిలో పెట్టుకుంటే, మనం చూస్తున్నవాటికన్నా మెరుగైన పరిస్థుతులను అపేక్షించలేము.
దేవుడు సర్వాధికారి, ఇదొక దీవెనకరమైన సత్యం. విశ్వాసాన్ని సాధన చేస్తూ ఉండగా హృదయం ఈ సత్యాన్ని బట్టే నెమ్మది పొందుతుంది. ఈ సత్యాన్నే ఆస్వాదిస్తుంది. నిజమైన విశ్వాసపు నైజం అదే. విశ్వాసం ఎల్లప్పుడూ దేవునితోనే నిండి ఉంటుంది. సిద్ధాంతపరమైన జ్ఞానానికీ, విశ్వాసానికి ఉన్న వ్యత్యాసం ఇదే. విశ్వాసం అదృశ్యుడైనవానిని నిలకడగా చూస్తుంది (హెబ్రీ 11:27). పొరపాటు చేయలేనంత జ్ఞాని మరియు నిర్దయ చూపలేనంత ప్రేమస్వరూపి అయిన దేవుని హస్తాల నుండే సమస్తమూ వస్తున్నాయని గ్రహించడం ద్వారా విశ్వాసజీవితంలో ఎదురయ్యే నిరాశానిస్పృహలను, కష్టనష్టాలను, హృదయవేదనలనూ అది సహిస్తుంది. దేవునితో కాకుండా మరి దేనితోనైనా మనం నిండి ఉన్నంత కాలమంతా హృదయానికి నెమ్మదీ, మనస్సుకు శాంతీ ఉండదు. అయితే మన జీవితాల్లోకి ప్రవేశించేదాన్నంతటినీ ఆయన హస్తం నుంచే పొందుతున్నామని గ్రహించినప్పుడు మన పరిస్థితులేవైనా, మనం నివసిస్తున్నది పూరి గుడిసెలోనైనా, చీకటి చెరసాలలోనైనా, హతస్సాక్షిగా దహించబడడానికి కట్టెలపై పేర్చబడినా, “మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను” అని మనం చెప్పగలుగుతాం (కీర్తన 16:6). అది వెలిచూపు భాష కాదు, విశ్వాసపు భాష!
అయితే పరిశుద్ధ లేఖనాల సాక్ష్యానికి శిరస్సు వంచకుండా, విశ్వాసాన్ని బట్టి జీవించకుండా, వెలిచూపును బట్టి హేతువును మాత్రమే ఆధారం చేసుకుని జీవిస్తుంటే మనం నాస్తికత్వం అనే ఊబిలో పడిపోతాము. ఇతరుల అభిప్రాయాలతో, ఆలోచనలతో మనం నియంత్రించబడితే మనకు ప్రశాంతత దూరమౌతుంది. పాపంతోనూ, శ్రమతోనూ నిండియున్న ఈ ప్రపంచంలో మనల్ని భయకంపితుల్ని చేసేవి, దుఃఖపరిచేవి చాలా ఉన్నాయి. దేవుడు సమకూర్చి జరిగిస్తున్నవాటిలో కూడా మనల్ని కలవరపరిచేవి, నివ్వెరపరిచేవి చాలా ఉన్నాయి. అయినంత మాత్రాన ‘నేనే దేవుణ్ణయ్యుంటే, దీన్ని అనుమతించను, దాన్ని సహించను’ అని చెప్పే అవిశ్వాస లోకస్థునితో ఐక్యమయ్యేందుకు అది హేతువు కాకూడదు. మనల్ని విస్మయానికి గురిచేసే పరిస్థితులు మధ్యలో ఉ న్నప్పుడు, “దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని” అని కీర్తనకారునిలా మనం చెప్పాలి (కీర్తన 39:9). “ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు” అని లేఖనం మనతో చెబుతుంది (రోమా 11:33). విశ్వాసంలో పరీక్షించబడాలంటే, ఆయన జ్ఞానాన్ని నమ్మాలంటే, నీతిలో బలపడాలంటే, ఆయన పరిశుద్ధ చిత్తానికి లోబడాలంటే అలాగే జరగాలి.
విశ్వాసికీ, అవిశ్వాసికీ మధ్యనున్న ప్రాథమికమైన వ్యత్యాసమిదే. అవిశ్వాసి లోకానికి చెందినవాడు. లోక ప్రమాణాలతోనే ప్రతిదానికి తీర్పు తీరుస్తాడు. ఇహలోకమే శాశ్వతం అనే భావనతో జీవితాన్ని చూస్తూ ఉంటాడు.తాను శరీరరీతిగా ఏర్పరచుకున్న త్రాసులోనే ప్రతిదానినీ తూస్తాడు. అయితే విశ్వాసి దేవుణ్ణి తెరపైకి తీసుకొస్తాడు. ఆయన కోణం నుండే సమస్తాన్ని చూస్తాడు. ఆత్మసంబంధమైన ప్రమాణాలను బట్టి సమస్తాన్ని నిర్ధారిస్తాడు. నిత్యత్వపు వెలుగులో జీవితాన్ని చూస్తూ ఉంటాడు. అలా చేస్తూ తాను పొందేది ఏదైనా, దాన్ని దేవుని హస్తం నుండే పొందుకుంటున్నానని నమ్ముతాడు. అందువల్ల భయంకరమైన తుఫాను మధ్యలో కూడా అతని హృదయం ప్రశాంతంగా ఉంటుంది, దేవుని మహిమ గురించిన నిరీక్షణలో అతడు ఆనందిస్తూ ఉంటాడు.
ఈ పుస్తకంలో చర్చించిన ఆలోచనా విధానాన్ని క్లుప్తంగా ఈ ప్రారంభపు మాటల్లో తెలియజేశాను. ‘దేవుడు దేవుడు కనుక ఆయన ఇష్టాన్నే జరిగిస్తాడు, కేవలం ఆయన ఇష్టాన్నే జరిగిస్తాడు, ఎల్లప్పుడూ ఆయన ఇష్టాన్నే జరిగిస్తాడు; ఆయన చిత్తం నెరవేరి ఆయనకు మహిమ కలగటమే ఆయన ప్రథమ ఉద్దేశం; ఆయన సర్వోన్నతుడు కాబట్టి ఆయనే విశ్వానికి సార్వభౌముడు’ అన్న విషయమే నా మూల ప్రతిపాదన. ఈ ఆలోచనను ఆధారం చేసుకుని దేవుడు మొదటిగా సృష్టిలో, రెండవదిగా పరిపాలనలో, మూడవదిగా తాను ఏర్పరచుకున్నవారి రక్షణలో, నాలుగవదిగా దుష్టులను తిరస్కరించడంలో, అయిదవదిగా మనుషులపై మరియు మనుషులలో జరిగించే కార్యాలలో తన సార్వభౌమత్వాన్ని ప్రదర్శిస్తున్నాడని వివరించాను. ఆపై మనిషి చిత్తానికి, మనిషి బాధ్యతకు సంబంధించి దేవుని సార్వభౌమత్వం పనిచేసే విధానాన్ని మరియు సృష్టికర్త ఔన్నత్యం పట్ల మనిషి కలిగుండాల్సిన ఒకే ఒక్క సరైన వైఖరిని చూపించడానికి ప్రయత్నించాను. క్లిష్టమైన అంశాలను చర్చించడానికీ, పాఠకుల మనసుల్లో ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఒక అధ్యాయాన్ని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ప్రార్థనలో దేవుని సార్వభౌమత్వం గురించి మరింత శ్రద్ధగా, అదే సమయంలో సంక్షిప్తంగా పరీక్షించడానికి మరొక అధ్యాయాన్ని కేటాయించాను.
చివరగా, మన హృదయాల ఆదరణ కోసం, మన ఆత్మలను బలపరచడం కోసం, మన జీవితాలను దీవించడం కోసం, లేఖనాల్లో దేవుని సార్వభౌమత్వం అనే సత్యం మనకు బయలుపరచబడిందని నేను చూపించడానికి ప్రయత్నం చేశాను. దేవుని సార్వభౌమత్వం గురించిన సరైన అవగాహన ఆరాధనతో కూడిన మనస్సును పెంపొందిస్తుంది. ఆచరణీయమైన భక్తికి ప్రోత్సాహాన్నిస్తుంది. పరిచర్యలో ఆసక్తిగా కొనసాగేందుకు ప్రేరణనిస్తుంది. దేవుని సార్వభౌమత్వం అనే సిద్ధాంతం మానవ హృదయాన్ని ఎంతో దీనమైనదిగా మారుస్తుంది. తనను రూపించిన దేవునిని మహిమ పరిచేందుకు మనిషి ధూళిలో కూర్చుని తనను తాను తగ్గించుకునే స్థాయికి తీసుకెళ్తుంది.
నేను రాసినవన్నీ నేటి క్రైస్తవ సాహిత్యానికీ, ప్రసంగాలకూ పూర్తి విరుద్ధంగా ఉ న్నాయని నాకు తెలుసు. దేవుని సార్వభౌమత్వం అనే సిద్ధాంతం ప్రకృతి సంబంధమైన మనిషి అభిప్రాయాలకూ, ఆలోచనలకూ పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అయితే మనం ఈ విషయాల గురించి ఆలోచించటము సాధ్యం కాదనేది సత్యం. దేవుని స్వభావాన్నీ ఆయన మార్గాలనూ సంపూర్ణంగా అర్థం చేసుకునే సామర్థ్యం మనకు లేదు. అందుకే దేవుడు తన మనస్సును మనకు బయలుపరిచాడు. ఆ బయలుపాటులో ఎంతో స్పష్టంగా ఆయన ఇలా అంటున్నాడు, “నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు.”
“ఆకాశములు భూమికి పైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి” (యెషయా 55:8,9). ఈ లేఖనాల వెలుగులో బైబిల్లోని అత్యధిక అంశాలు దేవునికి విరోధంగా ఉండే శరీరసంబంధమైన మనస్సు యొక్క నమ్మకాలకూ, ఇష్టాలకూ పూర్తి విరుద్ధంగా ఉంటాయని అంచనా వేయొచ్చు. అందువల్ల ప్రస్తుతం ప్రజాదరణ పొందిన నమ్మకాలను గానీ, సంఘవిశ్వాస ప్రమాణాలను గానీ కాకుండా, యెహోవా ధర్మశాస్త్రాన్ని, ఆయన ప్రమాణ వాక్యాన్ని మాత్రమే నేను ఆధారం చేసుకుంటున్నాను! సత్యమనే దీపపు వెలుగులో ప్రార్థనాపూర్వకంగా నేను రాసినదాన్ని శ్రద్ధగా, నిష్పక్షపాతంగా పరీక్షించమని నేను అందరినీ వేడుకుంటున్నాను. “సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి” (1 థెస్స 5:21) అనే దైవాజ్ఞను ప్రతీ పాఠకుడు వినునుగాక!